ఆ చైతన్యకణం లేకపోతే మాత్రం ఈ శరీరానికి సుఖానుభవం సాధ్యంకాదు...

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (20:05 IST)
మనలో ప్రతి ఒక్కరం సుఖం కోసం, ఆనందం కోసం తాపత్రయపడుతూ ఉంటాం. వాస్తవంగా నిజమైన ఆనందం అంటే ఏమిటో మనకు తెలియదు. నిజం చెప్పాలంటే సుఖంగా, ఆనందంగా ఉన్నవాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. ఎందుచేతనంటే నిజమైన ఆనందం చేకూర్చే స్ధానం తాత్కాలిక విషయాలకు అతీతంగా ఉంటుందని గ్రహించిన వారు చాలా తక్కువమంది.
 
సాధారణంగా ఆనందం మన జ్ఞానేంద్రియాల ద్వారా అనుభూతమవుతుంది. రాతికి జ్ఞానేంద్రియాలు ఉండవు. కాబట్టి దానికి సుఖః దుఃఖాల అనుభూతి ఉండదు. వికాసం లేని చైతన్యం కంటే వికసించిన చైతన్యం సుఖదుఃఖాలను మరింత గాఢంగా గ్రహించగలదు. చెట్లకు చైతన్యం ఉంది. కాని ఆ చైతన్యం వికసించలేదు. అన్ని రకాల వాతావరణాలకు తట్టుకొని చెట్లు చాలాకాలం జీవించగలవు. కాని దుఃఖాలను అనుభవించడం వాటికి చేతకాదు. ఏ మనిషినైనా రెండు మూడు రోజులు చెట్టు లాగా ఒకే చోట నిలబడి ఉండమని అంటే అతడు అలా నిలబడలేడు. కారణం అతని వికసిత చైతన్యం.  ఆయా జీవుల చైతన్య వికాసపు స్ధాయిని బట్టి సుఖానుభవం గాని, దుఃఖానుభవం గాని ఉంటుంది.
 
నిజానికి ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుభవిస్తున్న సుఖం సుఖం కానేకాదు. చెట్లకు మాట్లాడే శక్తి ఉన్నట్లయితే, మనం ఒక చెట్టును సమీపించి నువ్వు సుఖంగా ఉన్నావా అని అడిగినప్పుడు ఆ చెట్టు అవును సుఖంగా ఉన్నాను. సంవత్సరం అంతా ఇక్కడే నిలబడి గాలినీ, మంచునీ చక్కగా అనుభవిస్తున్నాను అని అనవచ్చు. కానీ మనిషి విషయంలో చాలా తక్కువ స్ధాయి అనుభవం. 
 
ఆత్యంతికమైన సమాధి స్ధితిలో మనిషి ఆధ్యాత్మికేంద్రియాల ద్వారా  అనుభవించే హద్దులేని దివ్యానందంలో ఉంటాడు. ఆ విధంగా ప్రతిష్టితుడైనవాడు ఎప్పుడూ సత్యాన్ని విడువడు. బుద్ధి అంటే తెలివి. సుఖాన్ని అనుభవించాలనుకునే వాడు తెలివి గలవాడు కావాలి. వాస్తవంగా ఆలోచిస్తే అనుభవించేది భౌతికశరీరం కాదని శరీరం లోపల ఉండే చైతన్యాగ్ని కణమే అని తెలుస్తుంది. మనకు జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆ చైతన్యకణం లేకపోతే మాత్రం ఈ శరీరానికి సుఖానుభవం సాధ్యంకాదు. అంటే మనం నిజమైన ఆనందాన్ని చవి చూడాలి అంటే ఈ భౌతిక ఇంద్రియ విషయాలకు అతీతులముకావాలి అని అర్ధం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు