ఈ నెల ఆ తేదీలో మీరు తప్పక తిరుమల రావాలి.. ఎందుకంటే?

బుధవారం, 11 అక్టోబరు 2017 (20:50 IST)
తిరుమలలో జరిగే స్వామివారి కార్యక్రమాలు ఏవైనాసరే భక్తులు ఎంతో భక్తిభావంతో తిలకిస్తుంటారు. చిన్న, పెద్దా కార్యక్రమాలని తిరుమలలో ఏదీ ఉండవు. ఏదైనాసరే వేలాదిమంది భక్తులు దర్శించి పునీతులవుతుంటారు. అలాంటి కార్యక్రమాల్లో పుష్పయాగం ఒకటి. ఎన్నో రకాల పుష్పాలతో స్వామివారికి యాగం నిర్వహిస్తుంటారు. ప్రతి యేటా జరిగే ఈ పుష్ప యాగానికి భారీగానే భక్తులు తరలివస్తుంటారు.
 
కార్తీక మాసంలో శ్రవణా నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబరు 28వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్ప యాగ మహోత్సవం ఘనంగా జరుగనుంది. అక్టోబరు 27న పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ కారణంగా వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దయ్యాయి.
 
అక్టోబరు 28న శ్రీవారి ఆలయంలో రెండవ అర్చన, రెండవ ఘంట, నైవేద్యం అనంతరం శ్రీ భూసమేత మలయప్ప స్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలకు వేంచేపుచేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. 
 
మధ్యాహ్నం 1.00 నుంచి 5.00 గంటల వరకు పుష్పయాగం వేడుకగా చేపడతారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, బ్రహ్మూత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది.
 
కాగా, దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శతాబ్దం నుంచి ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చేసేవారని శాసనాలు తెలుపుతున్నాయి. అంతేగాక అప్పట్లో బ్రహ్మూత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ఏడవ నాడు స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంది. ఆ తరువాత నిలిచిపోయిన ఈ దివ్య పుష్పయాగ మహోత్సవాన్ని 1980, నవంబరు 14న టిటిడి పునరుద్ధరించి ప్రతి ఏటా కార్తీక మాస శ్రవణా నక్షత్ర పర్వదినాన నిర్వహిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు