శోభనపు గదిలోకి ప్రవేశిస్తూ కిందపడి మరణించాడు... అప్పుడేమైంది?

మంగళవారం, 26 జూన్ 2018 (14:31 IST)
రాఘవేంద్ర స్వామికి సకలవిధ సేవలను భక్తితో చేసే గురు వెంకటుడు అనే భక్తుడు ఉండేవాడు. అతడు అగ్రహారపు అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడు. దైవ యోగంతో వధువు పుష్పావతి అయినది. గురువుగారి సన్నిధిలోనే తన అల్లుడు ఉన్నాడని తెలుసుకున్న గృహస్థుడు కూతురి శోభనం చెయ్యడానికి రాఘవేంద్ర స్వామి అనుమతి పొందాడు. వెంటనే తన అల్లుణ్ణి ఇంటికి పిలుచుకుపోయాడు. 
 
మరుసటి ఉదయం స్వామివారు వారింటికి వచ్చి నూతన దంపతులతో పాద పూజ స్వీకరించి దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ... అని ఆశీర్వదించారు. ఫల మంత్రాక్షతలను ఇచ్చారు. అప్పుడు సమయం రాత్రి సమయం పది గంటలు అవుతుంది. స్వామి వారు పూజాదులను ముగించుకుని కూర్చున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఆనాటి ఉదయం దీవెన తీసుకున్న వధువు ఏడుస్తూ వచ్చింది. స్వామి నా పతిదేవుడు శోభనపు గదిలోకి ప్రవేశిస్తూ కిందపడి మరణించాడు. 
 
వైద్యులు పరీక్షించి లాభం లేదు ప్రాణం పోయింది అన్నారు. ఇప్పుడు మీరే మాకు దిక్కు అని గట్టిగా ఏడవసాగింది. కరుణాసాగరులైన స్వామి హృదయం కరిగింది. వెంటనే స్వామి మూలరాముడు ఉన్నాడు చింతించకండి అని ఓదార్చి కొద్దిసేపు ధ్యానంలో మునిగిపోయారు. తరువాత మేలుకుని నా ఆశీర్వాదం అబద్దం కాదు అతనికి పూర్వార్జిత పాప ఫలితంగా మృత్యువు వచ్చింది అని చెప్పారు. కమండలాన్ని తీసుకుని వారి ఇంటికి అందరితో కూడి వచ్చారు. అక్కడ నేలపై చలనం లేకుండా పడిన గురువెంకటుని శరీరాన్ని కమండల జలంతో ప్రోక్షించి మూడుసార్లు నిమిరాడు. మనసులోనే మంత్రాన్ని పఠించి ధ్యానంలో నిమగ్నులయ్యారు. 
 
ఆశ్చర్యం.... ఒక్క క్షణంలో గురువెంకటుని శరీరం కదలసాగింది, ఊపిరి ఆడడం ప్రారంభమైంది. లేచి కూర్చున్నాడు. తన ప్రక్కలో స్వామివారు కూర్చున్నది చూశాడు. వెంటనే గురువుగారు తమరు ఇక్కడున్నారు. నాకు ఏమైంది అని అడిగాడు. దుఃఖసాగరంలో మునిగిన ఇల్లంతా ఆనందోత్సాహాలతో నిండింది. గురువుగారు మీ ఆశీర్వాదం ఫలించి నా మాంగళ్యాన్ని రక్షించింది. మీరు మహామహితులు అని నమస్కారం చేసింది పెళ్ళికూతురు. అప్పుడు రాఘవేంద్రస్వామి నవ్వుతూ బిడ్డా..... అన్ని శ్రీ మూలరాముని దయ, అతని ఇచ్ఛ అని తెలుసుకో. మీరు ఆనందంతో పుత్రపౌత్రులతో కలకాలం వర్థిల్లండి అని దీవించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు