తిరుమల కళ్యాణ కట్ట ఎక్కడ వుండేదో తెలుసా?

శనివారం, 25 ఫిబ్రవరి 2017 (20:13 IST)
తిరుమల శ్రీవారి భక్తులు తలనీలాలు సమర్పించే స్థలాన్ని కళ్యాణకట్ట అని పిలుస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. స్వామివారికి తలనీలాలు సమర్పించే సంప్రదాయం ఎన్నేళ్ల క్రితం మొదలైందో నిర్దిష్టంగా తెలియదుగానీ.. రెండున్నర శతాబ్దాల క్రితం కొండ కిందే తలనీలాల సమర్పణ జరిగేదని చెబుతారు. చంద్రగిరి సమీపంలోని కళ్యాణీ నదీ తీరంలో వెలసిన క్షురక కేంద్రాలకే కళ్యాణకట్ట అని పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. కళ్యాణకట్టకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా..
  
స్వర్ణముఖి నదికి కళ్యాణి, భీమా అనే రెండు ఉపనదులున్నాయి. కళ్యాణీనది ప్రస్తుత శ్రీనివాసమంగాపురం సమీపంలోని నరసింగాపురం వద్ద స్వర్ణముఖిలో కలుస్తుంది. కళ్యాణీ నదిపై నిర్మించినదే కళ్యాణీ డ్యాం. తిరుమలకు ఈ డ్యామ్‌ నుండే సరఫరా అవుతున్నాయి. కళ్యాణీనదీ తీరంలో వెలసినదే కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం. ఒకప్పుడు శ్రీనివాసమంగాపురంను శ్రీనివాసపురం అని పిలిచేవారు. దాదాపు 240 సంవత్సరాల క్రితం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వైభవోపేతంగా ఉండేదట. 
 
కళ్యాణీ నదీ తీరంలో కళ్యాణకట్టలో వెలిశాయి. అప్పట్లో తిరుమల శ్రీవారి దర్సనానికి వచ్చే భక్తులు. ఇక్కడే తలనీలాలు సమర్పించి కళ్యాణీ నదిలో స్నానం చేసి, కళ్యాణ వేంకటేశ్వరున్ని దర్సించుకునేవారట. అప్పుడే తలనీలాలు తీసే కేంద్రాలకు కళ్యాణకట్టలు అని పేరు వచ్చిందట. ఆపై అదే పేరు స్థిరపడింది కళ్యాణ వేంకటేశ్వరున్ని దర్శించుకున్న అనంతరం..తిరుమలలో ఏవైనా ఉత్సవాలున్నా, ప్రత్యేకంగా అక్కడిదాకా వెళ్లాలనుకున్నా గుంపులు, గుంపులుగా వెళ్ళేవారట. ఈ ప్రయాణంలో తప్పిపోకుండా ఉండేందుకు తప్పిపోయిన వారు కలుసుకునేందుకు గుంపులో ముందు, వెనుక బాగా ఊదేవారట.
 
ఇప్పటికీ మైసూరు ప్రాంతం నుంచి వచ్చే భక్తులు బాకా ఊదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీనివాసపురంలో కళ్యాణకట్టలు మెల్లగా కనుమరుగయ్యాయి. తిరుమలలోని చంద్రగిరి రస్తా పక్కనున్న మంగలిబావి వద్ద కళ్యాణకట్టలు ఏర్పాటయ్యాయి. ఊరికి దూరంగా ఉండే ఈ కళ్యాణకట్టలు క్రమంగా ఆలయ సమీపానికి మారాయి. ముందుగా తిరుమల నడిబొడ్డున ఉన్న రావిచెట్టు కింద తలనీలాలు తీసేవారట. ఆ తరువాత పక్కనే ప్రత్యేక భవనం నిర్మించారు. పెరుగుతున్న భక్తులరీత్యా అదీ చాలకపోవడంతో ప్రస్తుతమున్న కళ్యాణకట్టను నిర్మించారు. వందల మంది క్షురకులు నిత్యం పనిచేస్తున్నారు. రోజుకు 25వేల మంది తలనీలాలు సమర్పిస్తున్నారు. యేడాది మొత్తంగా చూస్తే 20 లక్షల మందికిపైన క్షురకర్మ చేయించుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి