ఆంజనేయ స్వామికి తమలపాకు మాల ఎందుకు వేస్తారు?

శనివారం, 20 జులై 2019 (20:55 IST)
సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. దాంతో రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. రామునికి అన్వేషణలో ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయం రామునితో చెప్పాలని లంక నుండి బయలుదేరతాడు. అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆంజనేయ స్వామిని ఆశీర్వదించాలని ఆశిస్తుంది.
 
అయితే అశోకవనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దానితో పుష్పాలకు బదులు తమలపాకును కోసి, ఆంజనేయ స్వామి తల మీద పెట్టి దీవిస్తుంది. అందుకే తమలపాకు ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైనది.
 
అది మాత్రమే కాదు.... సీతమ్మ వద్ద నుండి తిరిగ వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ... గట్టిగా హుంకరిస్తాడు హనుమంతుడు. అది విన్న వానరులకు విషయం అర్దమైపోతుంది. హనుమంతుడు కచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వేయికళ్లతో ఎదురుచూస్తారు.
 
అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లనే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కురిపిస్తాడు. ఆంజనేయ స్వామి జ్యోతి స్వరూపుడు. ఆయనను పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి. అవరోధాలు తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతునికి ప్రపంచ వ్యాప్తంగా పూజలు జరుగుతాయి. పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకు మాలను సమర్పిస్తే మనోబీష్టాలు నెరవేరుతాయి. అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణ చేస్తే సర్వసంపదలూ, సుఖసంతోషాలు కలుగుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు