రూ.కోట్లు కురిపిస్తున్న శ్రీవారి హుండీ.. లాక్డౌన్ తర్వాత తొలిసారి...

మంగళవారం, 3 నవంబరు 2020 (09:13 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శ్రీవారి హుండీ ఆదాయం అంతకంతకూ పెరుగుతోంది. కరోనా లాక్డౌన్ తర్వాత తొలిసారి ఏకంగా మూడు కోట్ల రూపాయల మేరకు హుండీ ఆదాయం వచ్చింది. పైగా, తిరుమల గిరులు భక్తులతో కళకళలాడుతున్నాయి. 
 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత మార్చి మూడో వారం నుంచి కరోనా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో దేవాలయంలో భక్తుల దర్శనాలను నిలిపిశారు. ఇపుడు దశలవారీగా భక్తులకు అనుమతిస్తున్నారు. 
 
ఫలితంగా గత వారాంతంలో హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ఆలయం తలుపులను భక్తుల కోసం తిరిగి తెరిచిన తర్వాత, తొలిసారిగా రూ.2.93 కోట్ల ఆదాయం లభించిందని, స్వామిని దర్శించుకున్న వారి సంఖ్య ఒక్కరోజులో 27,107గా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 
 
లాక్డౌన్ తర్వాత ఇంత పెద్దమొత్తంలో హుండీ ఆదాయం రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. అంతకుముందు స్వామివారిని రోజుకు 80 వేల నుంచి 90 వేల మంది, ఒక్కోరోజు దాదాపు లక్ష మంది వరకూ దర్శించుకునేవారన్న సంగతి తెలిసిందే. 
 
అప్పట్లో ఆదాయం సగటున రోజుకు 4 కోట్లకు పైగానే లభించేది. కాగా, ఇటీవలి కాలంలో స్వామివారి కల్యాణాన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులు వారాంతంలో ఒక్కసారిగా స్వామి దర్శనానికి రావడంతోనే భక్తుల సంఖ్య అమాంతం పెరిగిందని టీటీడీ అధికారులు విశ్లేషించారు. 
 
నిబంధనల మేరకు కరోనా వ్యాప్తి కాకుండా, కొండపై అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని, పరిమిత సంఖ్యలో భక్తులను అమతించాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టంచేశారు. ఆన్‌లైన్‌లో సైతం పరిమిత సంఖ్యలోనే టికెట్లను విక్రయిస్తున్నామని, అయితే, కల్యాణం చేయించుకున్న భక్తులు వారాంతంలో దర్శనానికి వస్తుండటంతోనే రద్దీ పెరుగుదలకు కారణమవుతోందని అంచనా వేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు