శ్రీవారి భక్తులు ముఖ్య గమనిక, గదులు ఈ తేదీల్లో అడ్వాన్స్ రిజర్వేషన్స్ రద్దు

గురువారం, 9 డిశెంబరు 2021 (20:01 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో 2022 జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14వ తేదీన వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని జనవరి 11వతేదీ నుంచి 14వతేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను టిటిడి రద్దు చేసింది.

 
శ్రీవారి దర్సనానికి విచ్చేసే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ తిరుమలలోని అన్ని గదులను కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయించాలని టిటిడి నిర్ణయించింది. ఎంబిసి-34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టిబిసి కౌంటర్, ఎఆర్‌పి కౌంటర్లలో 2022 జనవరి 11వ తేదీ తెల్లవారుజామున 12 గంటల నుంచి 14వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు గదులు కేటాయించబడతాయని టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.

 
జనవరి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్ ఉండదని తెలిపింది. శ్రీవారి దర్సనార్థం వచ్చే ప్రముఖులకు వెంకటాకళా నిలయం, రామరాజ నిలయం, సీతా నిలయం, సన్నిధానం, గోవింద సాయి విశ్రాంతి గృహాల్లో అలాట్మెంట్ కౌంటర్లు ఏర్పాటు చేసి గదులు కేటాయించనున్నారు. 
 
స్వయంగా వచ్చిన ప్రముఖులకు గరిష్టంగా రెండు గదులు మాత్రమే కేటాయించబడుతాయని తెలిపారు. సామాన్య భక్తులకు సిఆర్ఓ జనరల్ కౌంటర్ ద్వారా గదులు మంజూరు చేస్తామని టిటిడి తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు