18న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు - 25న ప్రత్యేక దర్శన టిక్కెట్లు రిలీజ్

ఠాగూర్

గురువారం, 14 ఆగస్టు 2025 (19:38 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. నవంబరు నెలకు సంబంధించి ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తెలిపింది. వీటి లక్కీడిప్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
 
శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగంగా, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు 21న ఉదయం 10 గంటలకు.. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. 23న ఉదయం పదింటికి అంగ ప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ కోటా, మధ్యాహ్నం మూడింటికి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 
 
25న ఉదయం పదింటికి రూ.300 టికెట్ల కోటా (ప్రత్యేక ప్రవేశ దర్శనం), మధ్యాహ్నం మూడింటికి తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ కోటా అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్‌ చేసుకోవాలని తితిదే సూచించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు