తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనంలో రెండే రోజులు : తితిదే ఛైర్మన్

గురువారం, 19 డిశెంబరు 2019 (16:23 IST)
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కేవలం రెండంటే రెండే రోజులని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తొలుత వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం పది రోజుల పాటు కల్పించనున్నారనే వార్తలు వచ్చాయి. వీటిపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజుల మాత్రమేనని, మొదటగా అనుకున్నట్టు పది రోజులు కాదని స్పష్టం చేశారు. 
 
తిరుమలకు వచ్చిన శారదా పీఠం అధిపతి స్వరూపానంద స్వామిని టీటీడీ చైర్మన్, ఆలయ ప్రధాన అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పిస్తామన్నారు. 
 
మరోవైపు ఉత్సవమూర్తుల విగ్రహాల అరుగుదల అంశాన్ని.. స్వామిజీ దృష్టికి అర్చకులు తీసుకొచ్చారని ఆయన తెలిపారు. చారిత్రక ఆలయాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్వామీజి సూచించారని చెప్పారు. ధార్మిక ప్రచారంలో భాగంగా ప్రతినెలా టీటీడీ తరపున ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు సుబ్బారెడ్డి తెలిపారు.
 
విశాఖ శ్రీశారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి బుధవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డి తదితరులు స్వామీజీలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామీజీలు ఈ నెల 21 వరకు తిరుమలలోనే బసచేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు