శ్రీవారి బ్రహ్మోత్సవాలు : పట్టు వస్త్రాల సమర్పణ.. సెంటిమెంట్‌కు తలొగ్గిన సీఎం జగన్?

మంగళవారం, 1 అక్టోబరు 2019 (09:07 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం తిరుమల కొండపై ధ్వజారోహణం చేయడంతో బ్రహ్మోత్సవాలు షురూ అయ్యాయి. శాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ ధ్వజపటం ఎగురవేశారు. తద్వారా ముక్కోటి దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆ పిమ్మట ఏపీ సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇందుకోసం ఆయన తిరుమలకు చేరుకుని ఈ వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత స్వామివారి పెద్ద శేష వాహన సేవలో జగన్ పాల్గొన్నారు. 
 
ఆ తర్వాత సీఎం జగన్ తిరుమలలో బస చేయాల్సి ఉన్నా దాన్ని రద్దు చేసుకుని రాత్రి 8.30కి తిరుగుప్రయాణమయ్యారు. అంతేకాకుండా, షెడ్యూల్‌ ప్రకారం దిగువ తిరుపతిలో తిరుచానూరు సమీపంలో పద్మావతి నిలయాన్ని ఆయన ప్రారంభించాలి. అలిపిరి-చెర్లోపల్లె నాలుగు లేన్ల రహదారి శంకుస్థాపనకు శంకుస్థాపన చేయాలి. 
 
అలాగే కొండపై నందకం అతిథిగృహం పక్కనున్న మాతృశ్రీ వకుళాదేవి యాత్రికుల వసతి సముదాయానికి ప్రారంభోత్సవంతో పాటు మరో వసతి సముదాయానికి శంకుస్థాపన చేయాల్సి ఉంది. అవేమీ చేయకుండానే శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి వెనుదిరిగారు. పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రులంతా తిరుమలలో రాత్రి బస చేసేవారు. అయితే జగన్‌ రెండు గంటల్లోనే వెనుతిరగడం చర్చనీయాంశమైంది. 
 
అయితే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇలా చేయడానికి బలమైన సెంటిమెంట్ అస్త్రం బాగా పని చేసిందని చెప్పొచ్చారు. ఇందుకు గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలను కూడా వివరించారు. ముఖ్యంగా, 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చినప్పుడు స్విమ్స్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అక్కడి నుంచే నేరుగా తిరుమలకు వెళుతుండగా అలిపిరిలో క్లెమోర్‌మైన్స్‌తో నక్సలైట్లు దాడి చేశారు. 
 
తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గరుడ సేవ రోజు కాకుండా ధ్వజారోహణం రోజే శ్రీవారికి పట్టువస్త్రాలు అందజేస్తూ వచ్చారు. ఆ సమయంలో ప్రారంభోత్సవాలు చేయలేదు. కానీ, ఎన్. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు తిరుమల రింగు రోడ్డు, పసుపుధార-కుమారధారలకు శంకుస్థాపన చేశారు. 
 
2014లో చంద్రబాబు తిరిగి సీఎం అయినప్పుడు 2003 ఘటనను దృష్టిలో పెట్టుకుని ప్రారంభోత్సవాలు లేకుండా చూసుకున్నారు. జగన్‌ కూడా చివరి నిమిషంలో ఎవరో ఈ సెంటిమెంటు విషయం చెప్పడంతోనే ఇలా రద్దుచేసుకున్నారని సమాచారం. మొత్తం సీఎం జగన్ వ్యవహారశైలి ఇపుడు సరికొత్త చర్చకు తెరలేపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు