తిరుమలలో ఈనెల 11, 12న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

మంగళవారం, 7 జూన్ 2016 (14:52 IST)
సర్కారీ సహస్ర కలశాభిషేకం సందర్భంగా తిరుమలలో ఈనెల 11, 12వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే జెఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. వేసవి సెలవుల వరకు ప్రతి శుక్రవారం విఐపి దర్శనాలను రద్దు చేస్తూ వస్తోంది. అయితే సహస్ర కలశాభిషేకం కావడంతో వరుసగా రెండు రోజులు విఐపి బ్రేక్‌ దర్శనాలు రద్దు కానున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు విఐపి దర్శనాలు రద్దు కానున్నాయి.
 
అలాగే వేసవి సెలవుల రద్దీ సందర్భంగా భక్తులకు లడ్డూల కొరత రానీయకుండా పనిచేసిన పోటు కార్మికులకు 480 మందికి 2,500 రూపాయల చొప్పున బహుమానం అందిస్తున్నట్లు తితిదే జెఈఓ శ్రీనివాసరాజు తిరుమలలో మీడియాకు తెలిపారు. 
 
ఇదిలావుండగా, తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో జూన్‌ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
 
తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను 1.30 గంటల నుంచి దర్శనానికి అనుమతించారు.

వెబ్దునియా పై చదవండి