లడ్డూ ట్రేలను శుభ్రపరిచేందుకు యంత్రాల కొనుగోలు : ఈవో సాంబశివరావు

బుధవారం, 8 జూన్ 2016 (12:15 IST)
శ్రీవారి లడ్డూ ప్రసాదం ట్రేలను వేడినీటితో శుభ్రపరిచేందుకు యంత్రాలను కొనుగోలు చేయాలని తితిదే ఈఓ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తితిదే సీనియర్‌ అధికారులతో ఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
నూతన యంత్రాలను కొనుగోలు చేయడం వల్ల ఒక గంటకు 500 ట్రేలను శుభ్రం చేయవచ్చని తెలిపారు. ప్రతినెలా మొదటి మంగళవారం స్థానికులకు కల్పిస్తున్న దర్శన స్లాట్లను ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించాలని ఆలయ అధికారులకు సూచించారు. వర్షాకాలంలో శ్రీవారి ఆలయం, మాడా వీధులు, 300 రూపాయల క్యూలైన్ల ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. 
 
భక్తుల లగేజీని తిరిగి అప్పగించే విధానాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఈఓ సూచించారు. రద్దీ రోజుల్లో లగేజీ అప్పగించేందుకు దాదాపు అరగంట పడుతోందని, ఈ సమయాన్ని 5 నుంచి 10 నిమిషాలు తగ్గించి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆర్జిత సేవలు, గదుల కేటాయింపులో మరింత పారదర్సకత పెంచేందుకు సిఫారసు లేఖలు అందించే వారి నుంచి డిజిటల్‌ సంతకాలు సేకరించాలని, ఇలా చేయడం వల్ల దళారుల ఆట కట్టించవచ్చని తెలిపారు.

తితిదే పోటు, అదనపు పోటు కార్మికులకు ఈఓ ప్రశంసలు 
గత మే నెలలో రికార్డు స్థాయిలో కోటికిపైగా లడ్డూలు తయారు చేసి తితిదే చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకున్న పోటు, అదనపు పోటులోని 482 మంది కార్మికులు, 16 మంది సహాయకుల సేవలను తితిదే ఈఓ సాంబశివరావు ప్రశంసించారు. పోటు కార్మికులు అద్భుతమైన సేవలు అందించారని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. పోటు కార్మికుల సేవలకు గుర్తింపుగా మొత్తం 498 మందికి ఒక్కొక్కరికి 2,500 ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి