సుప్రభాతం, తోమాల అర్చన, పాదపద్మారాధన, సేవల టిక్కెట్లను మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ సేవల లక్కీ డిప్ కోసం మార్చి 18 నుంచి మార్చి 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కి డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు మార్చి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్ల కోటాను మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి విడుదల చేస్తారు. జూన్ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే శ్రీవారి జ్యోష్టాభిషేకం టిక్కెట్లను మార్చి 21వ తేదీ ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంచుతారు. వర్చువల్ సేవల దర్శన స్లాట్లను మార్చి 21వ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టు తితిదే తెలిపింది.
జూన్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల తిరుపతిలో గదుల కోటాను మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టు తితిదే పేర్కొంది. భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టిక్కెట్లు, గదుల బుకింగ్ కోసం తితిదే అధికారిక వెబ్సైట్లో మాత్రమే సందర్శించాలని తితిదే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.