తితిదే ప్రధాన అర్చకుడుగా రమణదీక్షితులు.. అర్థరాత్రి జీవో జారీ

ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (11:40 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అర్థరాత్రి జీవోను జరీ చేసి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడుగా రమణ దీక్షితులుని తిరిగి విధుల్లోకి తీసుకుంది. గ‌తంలో హైకోర్టు ఇచ్చిన‌ తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 
 
గతంలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌ ప్రధాన అర్చకులతో పాటు ఇత‌ర‌ అర్చకులు విధుల్లో చేరాలని టీటీడీ తెలప‌డంతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణ దీక్షితులు తిరిగి విధుల్లో చేరారు.
 
అయితే, ప్రస్తుతం గొల్లపల్లి వంశం నుంచి ప్రధాన అర్చకులుగా వేణుగోపాల్ దీక్షితులు కొనసాగుతున్నారు. ఆయ‌న పర్మినెంట్ ఉద్యోగి కావడంతో అధికార బదలాయింపులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోవ‌ని ఆలయ అధికారులు తెలిపారు. 
 
కాగా, 65 ఏళ్లు దాటిన అర్చకులు పదవీ విరమణ చేయాల‌ని 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో అప్ప‌ట్లో టీటీడీతో పాటు గోవింద రాజ‌స్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు నిండిన‌ అర్చకులంద‌రూ రిటైర్ అయ్యారు. 
 
వారిలో రమణ దీక్షితులతో పాటు ఆయా ఆలయాల నుంచి 10 మంది మిరాశీ వంశీకులు, నాన్‌మిరాశీ అర్చకులు మరో 10 మంది విధుల నుంచి త‌ప్పుకున్నారు. దీంతో అప్ప‌ట్లోనే వారి స్థానంలో  తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడి ఆలయ ప్రధాన అర్చకులుగా పైడిపల్లి వంశం నుంచి ఏఎస్‌ కృష్ణ శేషాచల దీక్షితులు, గొల్లపల్లి వంశం నుంచి వేణుగోపాల్ దీక్షితులు, పెద్దింటి శ్రీనివాస దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందాచార్యులు నియమితుల‌య్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు