ఈ వారం తీర్థయాత్రలో భాగంగా మిమ్మల్ని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మోఢేరా సూర్య దేవాలయానికి తీసుకువెళుతున్నాం. అహ్మదాబాద్నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న 'పుష్పవతి' నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1022-1063లో చక్రవర్తి భీమ్దేవ్ సోలంకి-I నిర్మించారు.
క్రీస్తు పూర్వం 1025-1026 ప్రాంతంలో సోమనాథ్ మరియు చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమూద్ హమద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు.
సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే ' అహిల్వాడ్ పాటణ్ ' కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది. తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు. కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ విధంగా మోఢేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది. భారతదేశంలో మూడు సూర్యదేవుని ఆలయాలున్నాయి. వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్ మందిరం, రెండవది జమ్మూలోనున్న మార్తాండ్ ఆలయం మరియు మూడవది మనం చెప్పుకుంటున్న గుజరాత్లోని మోఢేరాకు చెందిన సూర్య మందిరం.