రాత్రి పది గంటల తరువాత అదృశ్యమయ్యే అద్భుత శివాలయం.. ఎక్కడ?

గురువారం, 21 జులై 2016 (13:56 IST)
దేశంలో ఒక్కొక్క ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఎన్నో వింతలు, విడ్డూరాలు దర్శనమిస్తాయి. గుజరాత్, భావనగర్‌కు కిలోమీటర్‌ దూరంలో ఉన్న అరేబియా సముద్రంలో పరమేశ్వరుని దేవాలయం ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏటంటే పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికి అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ఉందనడానికి సూచికగా ఓ ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంటుంది. తరువాత మెల్లిగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సముద్రం వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. ఇక భక్తులు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి పూజలు చేస్తారు. 
 
ఇలా రాత్రి పదిగంటల వరకూ మీరు అక్కడే కాలం గడపొచ్చు. ఇక ఆ సమయం దాటితే మాత్రం అక్కడి నుంచి వెనక్కి వచ్చేయాల్సిందే! ఎందుకంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీటముంచుతుంది. దాంతో అది మర్నాడు మధ్యాహ్నం వరకు కనిపించదన్నమాట! అదీ అక్కడి విశేషం. ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే దాదాపు ఆ ఎత్తువరకు నీళ్లు వచ్చేస్తాయి. 
 
కొన్ని వందల ఏళ్ళుగా ఇక్కడ ఇలాగే జరుగుతోందట. ఈ పరమేశ్వర ఆలయాన్ని పాండవులు నిర్మించారన్నది స్థలపురాణ గాథ! పౌర్ణమి రాత్రి పోటు సమయంలో పదిగంటల వేళ సముద్రం బాగా ముందుకు వచ్చేయడం, మెల్లిగా ఆలయాన్ని తన గర్భంలో దాచేసుకునే దృశ్యం అక్కడి యాత్రికులకు ఎంతో కనువిందు చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి