యాత్రికుల పూజకే పరిమితమైన భోజ్‌పూర్ సోమనాథుడు!!

FILE
మధ్యప్రదేశ్‌ భోజ్‌పూర్‌లోని అతి పురాతనమైన శివాలయం ఉంది. ఈ శివాలయంలోని స్వామిని సోమనాథునిగా పిలుస్తారు. 11వ శతాబ్దంలో నిర్మితమైనట్లు చెప్పబడుతున్న ఈ ఆలయం ఎత్తైన వేదికపై నిర్మించబడింది. 32.25 మీటర్ల పొడవుతో, 23.50 వెడల్పుతో కనిపించే ఈ ఆలయం ఎత్తు ఐదు మీటర్లు. భోజ్‌పూర్ గ్రామం మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్య పట్టణమైన భోపాల్ నుంచి దక్షిణంగా ఇటార్సీ వైపు వెళ్లే దారిలో ఈ ఆలయం ఉంటుంది.

ఈ ఆలయంలోని శివలింగం చాలా పెద్దది. ఈ లింగం సుమారు 7.5 అడుగుల ఎత్తుతో, 18 అడుగుల చుట్టుకొలతను కలిగివుంటుంది. అయితే పాలరాయితో తెల్లగా ప్రకాశించే ఈ శివలింగం యాత్రికుల పూజకే పరిమితమైంది. ఈ ఆలయంలో అర్చకులు నిత్యపూజలు చేస్తున్న దాఖలాలు లేవు. పర్యాటకులు మాత్రమే ఈ భారీ శివుడిని స్మరించుకుని పూజలు చేస్తుంటారే తప్ప, శివాలయాల్లో జరిగే నిత్యపూజలకు సోమనాథుడు నోచుకోలేదు. అయితే గుడిలోనున్న భారీ శివలింగానికి ఎదురుగా ఉన్న చిన్న శివలింగానికి దర్శనానికి వచ్చిన భక్తులు, యాత్రికులు పూజలు చేస్తుంటారు.

ఈ గుడికి తలుపులు పెట్టేందుకు నిర్మించిన రాతిచట్రం చాలా ఎత్తుగా ఉంది. దానిపై కుబేరుడు, ద్వారపాలకులు, నదీమతుల్లులైన గంగ, యమునలు వంటి అనేక శిల్పాకృతులు యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి. అంతేగాకుండా గోపురంతో కూడిన ఈ ఆలయంలో శివపార్వతీ, లక్ష్మీనారాయణ, బ్రహ్మ సరస్వతీ, సీతారాముల విగ్రహాలు కూడా దర్శనమిస్తుంటాయి.

ఇంకా కేవలం సిమెంట్, సున్నం వంటివి వాడకుండా రాళ్లను మాత్రమే పేర్చుకుంటూ కట్టిన అతి పురాతనమైన ఆనకట్టలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇంకేముంది.. భోజ్‌పూర్ గ్రామంలో పచ్చపచ్చని చెట్లు, కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసివున్న సోమనాథ ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు ఎప్పటికీ ఓ మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సంశయము లేదు.

వెబ్దునియా పై చదవండి