సంక్రాంతి... ఆటలతో సచివాలయ ఉద్యోగుల్లో నూతనోత్తేజం... అనూరాధ(ఫోటోలు)

బుధవారం, 10 జనవరి 2018 (19:49 IST)
అమరావతి : నిత్యం ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహించే సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి సంబరాలు సందర్భంగా నిర్వహిస్తున్న ఆటవిడుపు కార్యక్రమాలు ఎంతో ఉత్తేజనిస్తాయని రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి అనురాధ అభిప్రాయపడ్డారు. సచివాలయ ఆవరణలో మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు, పురుషులకు కబడ్డీ పోటీలను సంక్రాంతి సంబరాల సందర్భంగా బుధవారం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ.సుబ్రహ్మణ్యం, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి అనురాధ, రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ. సుబ్రహ్మణ్యం, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునీత మహిళా ఉద్యోగులు వేస్తున్న ముగ్గులను తిలకించారు. అనంతరం రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి అనురాధ విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ప్రతి ఏటా సచివాలయంలో సంక్రాంతి సంబరాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. 
 
ఈ సంబరాల్లో భాగం ఉద్యోగుల మధ్య సంప్రదాయ ఆటల పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ను పునాదుల స్థాయి నుంచి అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సచివాలయ ఉద్యోగులు సైతం రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఇలా నిత్యమూ తీవ్ర ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సంక్రాంతి సంబరాల పేరిట నిర్వహిస్తున్న ఆటల పోటీలు ఎంతో ఉత్తేజనిస్తున్నాయన్నారు. 
 
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు యు.మురళీకృష్ణ మాట్లాడుతూ, సంక్రాంతి సంబరాల పేరిట మూడేళ్ల  నుంచి ఉద్యోగుల మధ్య ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా జిల్లాల్లో సంక్రాంతి సంబరాల నిర్వహణకు ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున కేటాయించిందన్నారు. సచివాలయంలో ఆటల పోటీల నిర్వహణకు మూడు లక్షల రూపాయలు కేటాయించిందన్నారు. ముగ్గుల పోటీలకు 300ల పైబడి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారని, వారిని మూడు విభాగాలుగా విభజించామని ఆయన తెలిపారు. 45 ఏళ్ల లోపు, పైబడిన వారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 
 
విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్న వారందరికీ కన్సులేషన్ బహుమతులు అందజేయనున్నామన్నారు. పురుషులకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 15 జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు. ఈ పోటీల్లో విజేతలకు కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్న వారందరికీ కన్సులేషన్ బహుమతులు అందజేయనున్నామన్నారు. గురువారం మహిళా ఉద్యోగుల మధ్య కబడ్డీ పోటీలతో పాటు కోలాటం, గంగిరెద్దుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు