అవినీతిలో మునిగిన పాఠశాలల ఆటలు

అధికారుల అలసత్వం, విద్యాశాఖాధికారుల విచక్షణారాహిత్యం వలన కొంతమంది జిల్లా కార్యదర్శుల జేబుల్లో లక్షలకు లక్షలు చేరుకుంటున్నాయి. ఇది తెలిసి కూడా విద్యాశాఖ చోద్యం చూస్తూవుంది.

కాని రాష్ట్రంలోని పాఠశాలల ఆటగాళ్లకు మాత్రం తిప్పలు తప్పడంలేదు. విద్యాశాఖ అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఆటగాళ్ళకు శాపంగా మారింది. పాఠశాల క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన విద్యాశాఖ అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో అవినీతి జడలు విచ్చుకుంటోంది.

ప్రస్తుతం కర్నూలలో నిర్వహిస్తున్న జాతీయ అండర్..19 సి.కె. నాయుడు క్రికెట్ టోర్ని ఇందుకు అద్దం పడుతోంది. ఇక్కడి అవినీతి సాక్షాత్తూ కర్నూలు జిల్లా కలెక్టరునే బురిడీ కొట్టించాయి.

ఏకంగా ఏడు లక్షలరూపాయలకు ఎసరు పెట్టారు అవినీతికి అలవాటు పడ్డ అధికారులు. కలెక్టర్ అమాయకాన్ని అడ్డుపెట్టుకుని సి.కె. నాయుడు ట్రస్ట్ నుంచి కూడా మూడు లక్షల రూపాయలు డ్రా చేయించారు.

జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆయా రాష్ట్రాలే టి.ఏ, డి.ఎ భరిస్తాయి. ఒక్కో ఆటగాడికి రోజుకు 125 రూపాయల వంతున డి.ఎ చెల్లిస్తాయి. నిర్వాహకులు కేవలం వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తే చాలు.

కాని అన్నీ తామే అయి వ్యవహరించే జిల్లా కార్యదర్శులు అధికారులను మభ్యపెట్టి లక్షలకు లక్షలు దోచుకోవడం విమర్శలకు దారితీస్తోంది.

ఇది మచ్చుకు ఒక్కటి మాత్రమే. రాష్ట్రం మొత్తంమీద పాఠశాలల క్రీడలకు అవినీతి జాడ్యం పట్టుకుంది. మరి దీనికి రాజకీయ నాయకుల అండదండలుండడం కూడా గమనార్హం.

వెబ్దునియా పై చదవండి