కబడ్డీ క్రీడాకారిణిపై కోచ్ అత్యాచారం.. ఎక్కడ?

మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (11:19 IST)
ఇటీవలికాలంలో తమ వద్ద శిక్షణ పొందే క్రీడాకారిణులపై కోచ్‌లు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇటీవల రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కోచ్‌లపై క్రీడాకారిణిలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం ఇంకా తేలకముందే క్రీడా రంగంలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. తాజాగా కబడ్డీ క్రీడాకారిణి కూడా ఇలాంటి ఆరోపణ చేసింది. 
 
తనపై కోచ్ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుంది. బాధితురాలు గతంలో జాతీయ కబడ్డీ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. అత్యాచార ఘటనపై ఢిల్లీ ద్వారకలోని బాబా హరిదాస్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 2012లో బాధితురాలు కబడ్డీ ఆటలో పాల్గొనేందుకు హిరాన్‌కుడ్నాకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఆ తర్వాత కొంతకాలానికి అంటే 2015లో కోచ్ జోగిందర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తన అనుమతి లేకుండా తనతో లైంగిక చర్యలకు పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
అలాగే, 2018లో తనకు వచ్చిన ప్రైజ్ మనీలో వాటా ఇవ్వాల్సిందిగా బెదిరించారని, దీంతో అతడి బ్యాంకు ఖాతాకు రూ.43.5 లక్షలు బదిలీ చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత బాధితురాలికి వివాహమైంది. అప్పటి నుంచి జోగిందర్ మళ్లీ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది. 
 
పైగా, తన ప్రైవేట్ ఫోటోలు లీక్ చేస్తానంటూ బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచార ఘటనపై బాధితురాలు కోర్టులో కూడా ఇదేవిధంగా వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు