తెలంగాణ రిజల్ట్స్ : ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందంటే...

మంగళవారం, 11 డిశెంబరు 2018 (07:10 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. 
 
తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల్లోని ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 1821 మంది పోటీ చేస్తున్నారు. ప్రతి పోలింగ్ లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్ళపై జరిగే ఓట్ల లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణిస్తారు. అలా 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను 2379 రౌండ్లుగా లెక్కిస్తారు. 
 
అయితే, అత్యధికంగా శేరిలింగంపల్లిలో 42 రౌండ్లు, భద్రాచలం, అశ్వారావు పేటలో కనిష్టంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. దీంతో భద్రాచలం, అశ్వారావు పేట స్థానాల ఫలితం ముందుగానూ, శేరిలింగంపల్లి ఫలితం ఆలస్యంగా వెల్లడికానుంది. ఓట్ల లెక్కింపు కోసం 3360 మంది కౌంటింగ్  సిబ్బందిని, 1916 మంది పర్యవేక్షులను నియమించింది. 
 
ప్రతి అసెంబ్లీ పరిధిలో ఒక ఈవీఎం బ్యాలెట్‌ యూనిట్‌ను ఎంచుకుని దాని వీవీప్యాట్‌ బాక్సులోని ఓట్లను కూడా లెక్కించి సరిచూస్తారు. అభ్యర్థులు లేదా వారి తరపున ఏజెంట్లు ప్రత్యేకంగా ఫిర్యాదు చేస్తే ఇతర ఈవీఎం బ్యాలెట్లకు సంబంధించిన వీవీప్యాట్‌ రసీదులను లెక్కిస్తారు. ప్రతి రౌండ్‌ లెక్కింపు పూర్తవగానే అభ్యర్థి లేదా ఏజెంట్‌ సంతకాలు తీసుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు