ములుగు జిల్లాలో కంటైనర్ ఆస్పత్రి.. మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు

సెల్వి

శుక్రవారం, 19 జులై 2024 (14:26 IST)
Container hospital
మారుమూల కుగ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు వైద్య సహాయం అందించే ప్రయత్నంలో భాగంగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది "కంటైనర్ ఆసుపత్రి"గా పిలువబడుతోంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం బంధాల గ్రామ పంచాయతీలోని పోచారంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఈ కంటైనర్ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. 
 
ఈ కంటైనర్ ఆసుపత్రి ద్వారా వైద్యులు, అవసరమైన పరికరాలు, మందులతో పాటు మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందించే అవకాశం వుంటుంది. ఈ ఆసుపత్రి గిరిజన కుటుంబాలకు వైద్య సహాయం అందించేందుకు గ్రామాల చుట్టూ తిరుగుతుంది. 
 
మొబైల్ యూనిట్ అనుమానిత రోగులను స్క్రీనింగ్ చేస్తుంది. అవసరం మేరకు మందులు ఇవ్వబడతాయి. వర్షాకాలంలో ప్రధాన ప్రాంతం నుంచి దూరమయ్యే ఐదు గిరిజన గ్రామాలకు రెండు మూడు నెలల పాటు సేవలందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
 
రవాణా సౌకర్యం లేకపోవడంతో వైద్య సిబ్బంది మారుమూల గ్రామాలకు వెళ్లి గిరిజనులకు వైద్యం అందించడం కష్టంగా మారుతోంది. దీంతో ములుగు జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకుని కంటైనర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. రూ.కోటి వ్యయంతో దీనిని నిర్మించారు. 
 
హైదరాబాద్‌లో రూపొందించిన కంటైనర్ ఆసుపత్రిలో నర్సులు, ఆరోగ్య అధికారులకు ప్రత్యేక గదులు ఉన్నాయి. ఇది ఒక చిన్న ల్యాబ్‌ను కూడా కలిగి ఉంది. ఇంకా సీజనల్ వ్యాధులు, పాముకాట్ల చికిత్సకు అనుమతిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు డెలివరీ సౌకర్యాలను అందిస్తుంది. ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ ఈ సదుపాయాన్ని ప్రారంభించారు.
 
తాడ్వాయి మండలం బంధాల గ్రామపంచాయతీలోని పోచాపూర్ చుట్టుపక్కల ఉన్న నర్సాపూర్, అలిగూడెం, బంధాల, బోలేపల్లి గ్రామాలకు ఈ మొబైల్ యూనిట్ అదనపు ఆరోగ్య ఉపకేంద్రంగా పనిచేస్తుంది. 
 
అత్యవసర పరిస్థితుల్లో, మొబైల్ యూనిట్ రోగులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించడానికి అంబులెన్స్‌గా ఉపయోగించబడుతుంది.

ముఖ్యంగా కొనసాగుతున్న వర్షాకాలంలో మారుమూల గిరిజన గ్రామాలకు వైద్యం అందించడంలో కంటైనర్ ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య శాఖాధికారులు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు