ఈ నెల 6వ తేదీన కాళేశ్వరానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ..

ఠాగూర్

సోమవారం, 4 మార్చి 2024 (09:00 IST)
ఈ నెల 6వ తేదీన కాళేశ్వరానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సందర్శించనుంది. ఈ విషయాన్ని ఆదివారం తెలంగాణ నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరంపై సిఫార్సుల కోరామని తెలిపారు. నాలుగు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం గడువు ఇచ్చింది. 
 
ఎలాంటి అవగాహన లేకుండా కాళేశ్వరం బ్యారేజీలను నీటితో నింపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నిపుణుల కమిటీ సూచనలను మాత్రమే ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు.
 
'నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నాం. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఖాళీ చేశాం. ఈ విషయంలో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తూ తిరిగి నీటిని నింపాలని డిమాండ్ చేయడం బాధ్యతా రాహిత్యమే. మేడిగడ్డ పియర్లు కుంగిన తర్వాత అప్రమత్తమైన మా ప్రభుత్వం ఆ బ్యారేజీతో పాటు మిగిలిన రెండు బ్యారేజీలపై విచారణ నిర్వహించాలని ఎన్డీఎస్ఏకు లేఖ రాసింది. 
 
డిజైన్లు, నిర్మాణాలను అన్ని కోణాల్లో పరిశీలించామని, పగుళ్లు, కుంగుబాటుకు కారణాలు విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సిఫార్సులు చేయాలని కోరింది. నాలుగు నెలల్లో నివేదిక అందజేయాలని కమిటీకి ప్రభుత్వం ఇటీవల గడువు విధించింది. అయినప్పటికీ వీలైనంత త్వరగా కమిటీని కోరుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. డిజైన్లు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ.. అన్ని విషయాల్లో నిబంధనలను తుంగలో తొక్కింది అని మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు