తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఈ రిస్క్యూ ఆపరేషన్లో భాగంగా, టన్నెల్లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్లింది. ఆ తర్వాత నాలుగు గంటల తర్వాత తిరిగి వచ్చేసింది. టన్నెల్ లోపలికి 12 కిలోమీర్ల మేర ట్రైన్లో ప్రయాణించి అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ వెళ్లింది. మోకాలు లోతు నీరు ఉండి ఉండటంతో టన్నెల్లో ముందుకు వెళ్లలేకపోయింది.
కాగా, ప్రమాదం జరిగిన చోట ఆరు మీటర్ల మేర బురద పేరుకునివున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఫ్లై కెమెరాతో ప్రమాదం జరిగిన దృశ్యాలను చిత్రీకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే, అధునాతన సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్లాలని ఎన్డీఆర్ఎఫ్ బృందం చెబుతుంది. అలాగే, ప్రస్తుతం టెన్నెల్ నుంచి వెనక్కి తిరిగివచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోమారు లోపలికి వెళ్లే అవకాశం ఉంది.
మరోవైపు, టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం సర్వశక్తులా పోరాడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి హైదరాబాద్ నగరానికి వచ్చి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాస్తవ పరిస్థితిని వివరించారు.