11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం రేవంత్

వరుణ్

గురువారం, 29 ఫిబ్రవరి 2024 (12:28 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేసింది. అలాగే, గతంలో జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్నోళ్లు మళ్లీ చేసుకోనక్కర్లేదని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ 11 వేల పోస్టుల్లో 2629 పోస్టులు ఎస్ఏ, 6508 పోస్టులు ఎస్.జి.టి పోస్టులు, బాషా పండితులు 727, పీఈటీలు 182 పోస్టులు ఉన్నాయి. ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్టీజీలు 796 పోస్టులు ఉన్నాయి. 
 
గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం జారీచేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. గత యేడాది సెప్టెంబరు ఆరో తేదీన 5089 పోస్టులతో భారాస ప్రభుత్వం నియామక ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, అదనంగా మరో 5 వేల పోస్టులను జత చేసి మొత్తం 11062 పోస్టులతో ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. 
 
హైదరాబాద్ ఔటర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం! 
 
హైదరాబాద్ ఔటర్ టోల్ టెండర్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. టెండర్ల ఖరారుపై పూర్తి వివరాలు సేకరించే బాధ్యతను హైదరాబాద్ మున్సిపల్ డెవలప్‌మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ అమ్రపాలికి అప్పగించారు. పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించనున్నట్టు సీఎం తెలిపారు. ఆ తర్వాత దర్యాప్తు బాద్యతలను సీబీఐ లేదా తత్సమాన సంస్థకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. అలాగే, ఈ టెండర్లకు సంబంధించి ఫైళ్లు మాయమైనట్టు గుర్తిస్తే సంబంధిత బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. 
 
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని, ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ మొత్తానికి టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏపై బుధవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయముంది? ఏయే సంస్థలున్నాయి? బాధ్యులెవరూ? అన్న కోణాల్లో దర్యాప్తు చేయాలన్నారు.
 
ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, టెండర్ల విధివిధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలు అందజేయాల్సిన బాధ్యతను హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగిస్తున్నాం. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయికి చెందిన మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తాం అని ఆయన తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు మాయమైనట్టు గుర్తిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు