తెలంగాణా పోలీస్ శాఖను వణికిస్తున్న కరోనా.. 10 శాతం మందికి వైరస్

గురువారం, 27 ఆగస్టు 2020 (09:17 IST)
కరోనా వైరస్ మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో ముందు వరుసలో ఉన్న కోవిడ్ వారియర్లలో పోలీసులు కూడా ఒకరు. అయితే, ఈ పోలీసులపై కరోనా దాడి చేస్తోంది. ఫలితంగా అనేక మంది మృత్యువాతపడుతున్నారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు. ముఖ్యంగా, తెలంగాణ పోలీసులు ఈ వైరస్ బారినపడుతున్న వారిలో అధికంగా ఉన్నారు. ఇప్పటికే మొత్తం పోలీసుల్లో పది శాతం మంది వరకు ఉన్నారు. 
 
కరోనాను నియంత్రించేందుకు మార్చిలో కేంద్రం లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 10 శాతం మంది పోలీసులు వైరస్ బారినపడ్డారు. తెలంగాణ పోలీస్ శాఖలోని అన్ని విభాగాలలోను కలుపుకుని మొత్తం 54 వేల మంది పోలీసులు ఉన్నారు. ఈ నెల 25 నాటికి మొత్తం 5,684 మంది పోలీసులకు వైరస్ సోకింది. 
 
అంటే దాదాపు 10 శాతం మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. వీరిలో ఇప్పటివరకు 2,284 మంది డిశ్చార్జి కాగా 3,357 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే, ఇప్పటివరకు 43 మంది కరోనా కాటుకు బలయ్యారు. తాజాగా కరోనాతో మృతి చెందిన జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణామూర్తిని కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 44కు పెరుగుతుంది. అయితే, అదేసమయంలో పెద్ద సంఖ్యలో కోలుకుంటుండడం ఊరటనిచ్చే అంశం.
 
ఇక, హైదరాబాద్‌లో అత్యధికంగా 1,967 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. వీరిలో 801 మంది చికిత్స పొందుతుండగా, 1,053 మంది డిశ్చార్జ్ అయ్యారు. 23 మంది పోలీసులు మరణించారు. ఆ తర్వాతి స్థానంలో వరంగల్ నిలిచింది. అక్కడ 526 మంది పోలీసులకు కరోనా సంక్రమించగా, 361 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మృతి చెందగా, 163 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు