మృతుల కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా లేదా? టీఎస్‌లో ఏం జరుగుతోంది?

శనివారం, 22 ఆగస్టు 2020 (11:48 IST)
శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి, మల్లు రవిలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల చర్యపై ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
'శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేదా!? సంఘటన వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు వెళుతుంటే కేసీఆర్‌కు అంత భయమెందుకు!? దిండి వద్ద ఖాకీల పహారా పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి!?' అంటూ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
అంతకుముందు.. రేవంత్ రెడ్డి సహచరుడు మల్లు రవితో కలిసి శ్రీశైలంకు బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు-కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది
 
కాగా, గురువారం రాత్రి జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయారు. పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షలు చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు