దుబ్బాక ఓటర్లు మార్పును కోరుకున్నారు.. భాగ్యనగరి వాసులూ కొనసాగించాలి!

ఆదివారం, 22 నవంబరు 2020 (13:16 IST)
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పాగా వేసేందుకు శాయశక్తుగా కృషి చేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీకి చెందిన కీలక నేతలైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వంటి పలువురు కీలక నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిసారించారు. 
 
ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎన్నో హామీలు గుప్పిస్తున్నారన్నారు. ఉన్న స్పోర్ట్ కాంప్లెక్స్‌ల అభివృద్ధికే దిక్కులేదు కానీ కొత్తవి నిర్మిస్తామని ఆయన చెబుతున్నారన్నారు. 
 
హైదరాబాద్ నగరానికి రెండు వైద్యకాలేజీలు వచ్చాయని కిషన్ రెడ్డి చెప్పారు. దుబ్బాక ప్రజలు మార్పునకు తొలి అడుగు వేశారని తెలిపారు. ఆ మార్పును ముందుకు తీసుకెళ్లాలని హైదరాబాద్ ప్రజలను కోరుతున్నానని తెలిపారు. 
 
భూ కబ్జాలు, వర్షాలకు ఇళ్లు మునిగిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి తెలంగాణను ప్రజలు కోరుకోలేదని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రొటోకాల్‌ను పాటించట్లేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే తాను హైదరాబాద్‌కు కేంద్ర సర్కారు నుంచి నిధులు మంజూరు చేయించానని తెలిపారు. తెలంగాణలో అవినీతి కారణంగా రెవెన్యూ తగ్గుతోందని ఆరోపించారు.
 
తెలంగాణ సర్కారు దుబారా ఖర్చు చేస్తోందన్నారు. అవినీతి, దుబారా ఖర్చులను తగ్గించితే అభివ‌ృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అలాగైతేనే కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధులు వస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా బీజేపీ గెలిస్తే హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
 
హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా చేస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే, హైదరాబాద్ కాకుండా స్మార్ట్ సిటీగా కరీంనగర్‌ని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని అన్నారు. తాము వరంగల్‌కు కూడా స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చామని, వాటిని సక్రమంగా వినియోగించలేదని ఆరోపించారు. ఐదేళ్లయినా రెండు పడకగదుల ఇళ్లను కూడా తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు