ఆంధ్ర సెటిలర్లే నన్ను గెలిపించారు : తెరాస విజేత నార్నె శ్రీనివాస్

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (19:30 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగింది. ఈ గల్లీ ఎన్నికలకు ఢిల్లీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా, గల్లీ ఎన్నికలను బీజేపీ నేతలు రాష్ట్ర స్థాయి ఎన్నికల హోదా కల్పించారు. దీంతో ఈ ఎన్నికలకు అమితమైన ప్రాముఖ్యత నెలకొంది. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీన పోలింగ్ జరుగగా, ఓట్ల లెక్కింపు శుక్రవారం చేపట్టారు. ఈ ఫలితాల్లో అధికార తెరాస విజయభేరీ మోగించింది. రెండో స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. 
 
ఈ క్రమంలో హైదర్ నగర్ డివిజన్ నుంచి తెరాస అభ్యర్థి నార్నె శ్రీనివాస్ గెలుపొందారు. 2010 ఓట్ల మెజార్జీతో బీజేపీ అభ్యర్థిపై జయకేతనం ఎగురవేశారు. నార్నె గెలుపుతో తెరాస శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. 
 
ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకముంచి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కులాలు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తనకు ఓట్లు వేశారని తెలిపారు.
 
ముఖ్యంగా, ఆంధ్రాప్రాంతానికి చెందిన సెటిలర్లే తనను గెలిపించారని చెప్పారు. ప్రచార సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా తన వార్డులోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు