మహిళా దినోత్సవం.. టీఎస్సార్టీసీ నజరానాలు... లక్కీ డ్రా కూడా..

సోమవారం, 7 మార్చి 2022 (11:28 IST)
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీలకు టీఎస్‌ఆర్టీసీ పలు నజరానాలు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు 8వ తేదీన ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. 
 
గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం అన్ని ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రెండేసి సీట్లు కేటాయిస్తారు. మార్చి 31 వరకూ మహిళా ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులిస్తారు. 
 
విజేతలకు నెల రోజుల పాటు డిపో నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉచిత ప్రయాణంతో పాటు ప్రత్యేక బహుమతి ఉంటాయి. టిక్కెట్‌, ప్రయాణికురాలి ఫొటో 9440970000 నంబరుకు వాట్సాప్‌లో పంపినా డ్రాలో ఎంపిక చేస్తారని గోవర్ధన్‌, సజ్జనార్‌ తెలిపారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 30 డ్రైవింగ్‌ శిక్షణ సంస్థల్లో 30 రోజుల పాటు భారీ వాహనాల డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తారు. అభ్యర్థినులకు తప్పనిసరిగా ఎల్‌.ఎం.వి. లైసెన్సు, రెండేళ్ల అనుభవం ఉండాలి. 
 
అలాగే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులో  మహిళా ప్రయాణీకుల కోసం రద్దీ సమయంలో నాలుగు ప్రత్యేక ట్రిప్పులు నడపాలని టీఎస్సార్టీసీ నిర్ణయించింది. ఇంకా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో టి-24 టిక్కెట్‌పై మార్చి 8 నుంచి 14 వరకూ 20శాతం రాయితీ ఇస్తున్నారు.  అలాగే వరంగల్‌లోనూ ఇది వర్తిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు