కర్నాటక డ్రగ్స్ దందాలో ఆ నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు?

సోమవారం, 5 ఏప్రియల్ 2021 (09:26 IST)
కర్నాటక రాష్ట్రంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో నలుగురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై కర్నాటక పోలీసులు ఆ నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. 
 
ఈ నలుగురు ఎమ్మెల్యేలు పలుమార్లు బెంగళూరుకు వెళ్లి, డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్నారని గుర్తించామని గోవిందపుర పోలీసు ఇనస్పెక్టర్ ప్రకాశ్, ఆదివారం మీడియాకు తెలిపారు. వారి హాజరుపై తాము సాక్ష్యాలు సేకరిస్తున్నామని, ఆ తర్వాత విచారిస్తామని స్పష్టంచేశారు. వారందరినీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించనున్నామని తెలిపారు.
 
కాగా, ఈ కేసులో ప్రజా ప్రతినిధులతో పాటు టాలీవుడ్‌కు చెందిన వారికీ ప్రమేయం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వీరి పేర్లన్నీ ఇప్పటివరకూ రికార్డులకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇంతవరకూ వారి పేర్లను కర్ణాటక పోలీసులు బయట పెట్టలేదు. 
 
కానీ, నోటీసులు జారీ చేస్తే మాత్రం, వారు ఎవరన్న విషయం తేలిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాపారులు కలహర్ రెడ్డి, రతన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసిన పోలీసులు, విచారణకు రావాలని ఆదేశించారు.
 
ఈ దందాలో శాండల్‌వుడ్ నిర్మాత శంకర్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత, తెలంగాణ ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. కలహర్ రెడ్డి హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలను ఏర్పాటు చేసేవాడని, అతనికి శంకర్ గౌడ ద్వారా బెంగళూరు నుంచి మత్తు ముందులు అందేవని కూడా పోలీసులు గుర్తించారు.
 
అంతేకాకుండా, బెంగళూరులో జరిగే డ్రగ్స్ పార్టీలకు ఇరాన్ నుంచి అమ్మాయిలను రప్పించేవారని తేల్చిన పోలీసులు, వారు ఎవరు? ఎప్పుడెప్పుడు వచ్చారు? హైదరాబాద్ పార్టీలకు కూడా వెళ్లారా? అనే యాంగిల్ లో పోలీసులు కేసును విచారిస్తున్నారు. గతంలో కూడా టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం చెలరేగిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు