అఖిలేష్ మాతో టచ్‌లో వున్నారు... మా చర్చల్లో రాజకీయాలు చూడొద్దు: కేసీఆర్

బుధవారం, 2 మే 2018 (21:04 IST)
ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం తమ ప్రయత్నం కొనసాగుతోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే చాలా కష్టపడాలని తెలిపారు. కొంతమంది తెలిసీతెలియక చిన్న ప్రయత్నమనుకుంటున్నారని.. అఖిలేశ్‌తో చర్చలతో తమ ప్రయత్నమేంటో అందరికీ తెలుస్తుందన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో అఖిలేశ్ యాదవ్‌తో జరిగిన చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాలా రోజులుగా టచ్‌లో ఉన్నామని.. దేశంలో రాజకీయ వ్యవస్థ, సుపరిపాలనపై చర్చించామని తెలిపారు. 
 
తమ చర్చల్లో రాజకీయాలను చూడకండని కోరారు. దేశంలో మార్పు కోసం మాత్రమే తమ ప్రయత్నాలని తెలిపారు. ఒక్కోచోట ఒక్కో ప్రయత్నం జరుగుతుందన్నారు. 2019 ఎన్నికల కోసం తమ ప్రయత్నాలు కాదన్నారు. ఓ గొప్ప మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నంగా దీన్ని చూడాలన్నారు. అయితే ఒకరిద్దరితో అయ్యేది కాదు అని.. రెండు మూడు నెలల్లో ఒక అజెండా రూపొందిస్తామన్నారు కేసీఆర్. 
 
ఆ తర్వాత ఎవరు కలిసి వస్తారో వాళ్లతో కలసి పని చేస్తామన్నారు. తమ కూటమిదే నిర్ణయాధికారంగా ఉంటుందని.. ఎవరినో ప్రధానిని చేయాలని తమ ఆశ కాదన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ తాపత్రయం అన్నారు కేసీఆర్. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు