హుజూరాబాద్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?

గురువారం, 12 ఆగస్టు 2021 (17:52 IST)
హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల పోరును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల  రాజేందర్‌‌ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఈ స్థానానికి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికార తెరాస ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తెరాస తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేయబోతున్నారనే వార్తలు వినపడుతున్నాయి. వరంగల్‌లో కీలక నేతగా ఉన్న కొండా సురేఖకు పద్మశాలి, మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు పడతాయని టీపీసీసీ భావిస్తోంది. 
 
అందుకే ఆమెకు టిక్కెట్ ఇవ్వాలనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు కృష్ణారెడ్డి, కమలాకర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నాయి. అయితే చివరకు హుజూరాబాద్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.
 
నిజానికి ఈ ఉప ఎన్నికలను అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఇక్కడ మూడు ముక్కలాట ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
అయితే ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపై ఓ క్లారిటీ వచ్చేసింది. బీజేపీ నుంచి ఈటెల పోటీ చేస్తారని ఎప్పుడో తేలిపోగా.. బుధవారం టీఆర్ఎస్ పార్టీ కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించేసింది. ఇపుడు కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు