ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్ అవార్డ్... కొండగట్టు ప్రమాదంలో మృతి

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (18:43 IST)
ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే మాట మనకు తెలిసిందే. కొండగట్టు బస్సు ప్రమాదంలో మృత్యువాత పడ్డ డ్రైవర్ శ్రీనివాస్ ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్ అవార్డు అందుకున్నారు. తెలంగాణ సర్కారు ఆయనను ఈ అవార్డుతో సత్కరించింది. ఐతే విధి వక్రీకరించి ఆయన ఈరోజు కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతి చెందారు.
 
కాగా తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంలో 32 మంది ప్రయాణికులు మృత్యువాతపడగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 60 మంది ప్ర‌యాణికుల‌తో శ‌నివారంపేట నుంచి బ‌స్సు బ‌య‌లుదేరింది. ఈ కొండగట్టు ఘాట్ రోడ్డులో వెళుతుండగా, మ‌రో నిమిషంలో ప్ర‌ధాన ర‌హ‌దారిపైకి చేరుకునే స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. స్పీడ్ బ్రేక‌ర్ వ‌ద్ద బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో బస్సు అదుపు తప్పింది. 
 
అదేసమయంలో ప్ర‌యాణికులంతా డ్రైవ‌ర్ వైపు ఒర‌గ‌డంతో బ‌స్సు బోల్తా ప‌డింది. కొండ‌గ‌ట్టులో ద‌ర్శ‌నం ముగించుకుని జ‌గిత్యాల వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. మృతుల్లో మ‌హిళ‌లు, ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 60మందికి పైగా ప్ర‌యాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. 
 
ఘ‌ట‌నాస్థ‌లంలోనే అత్య‌వ‌స‌ర చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తున్నారు. స్థానికులు, అధికారులు, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు