1200 ఎకరాలు.. రూ. 6 వేల కోట్లు, కలకలం రేపుతున్న వామనరావు పోస్ట్...

శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:50 IST)
తెలంగాణలో కలకలం రేపిన పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. హత్యల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తుండగా.. అందుకు బలాన్నిచ్చే అధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హత్యకు గురైన న్యాయవాదులు గతంలో వేసిన కేసులు, మంథని ఏరియాలో జరిగిన పరిణామాలకు సంబంధించి సంచలన అంశాలు తెరపైకి వస్తున్నాయి.
 
ఇప్పటికే వామన్ రావు దంపతుల ఆడియో రికార్డులు వైరల్‌గా మారాయి. తాజాగా మరో అంశం వెలుగులోనికి రావడంతో వామన్ రావు దంపతుల హత్యపై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో వామన్ రావు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
 
సీలింగ్ యాక్ట్ పేరుతో 6 వేల కోట్ల రూపాయల భూ స్కాం జరుగుతుందని అందులో పేర్కొన్నారు వామన రావు. హైకోర్టు అడ్వకేట్ గట్టు వామనరావు పోస్టు ఇదీ..

'' మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలోని 18 గ్రామాల్లో 1973 సీలింగ్ యాక్ట్ ప్రకారం పట్టాలు కలిగి ఉన్న లబ్ధిదారుల పేర్ల నుండి వేరే ఇతర వ్యక్తుల పేర్లపైకి అక్రమ మార్గంలో సుమారు 1200 ఎకరాలు, ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 6 వేల కోట్ల విలువైన భూమిని బదలాయించి చట్ట విరుద్దంగా సీలింగ్ పట్టా మార్పిడి చేసిన అవినీతి అధికారులపై చర్యల కోసం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్) దాఖలు చేయనున్న నెన్నెల మండలం ఇందూరు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఇందూరి రాంమోహన్''
 
గట్టు వామనరావు చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగినట్టుగా తెలుస్తున్న ఈ పోస్టుకు.. ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా అన్న చర్చ జరుగుతోంది. భూ దందాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ మర్డర్ ప్లాన్లో ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రూ. 6 వేల కోట్ల విలువైన భూ దందా స్కాం గురించి వెలుగులోకి వస్తే పెద్ద తలకాయలు బయటపడతాయన్న ఆందోళనతో.. హంతకులతో ఎవరైనా చేతులు కలిపి ఉంటారా అన్న చర్చ ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతోంది. వామనరావు పోస్టులతో పాటు మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలోని 18 గ్రామాల సీలింగ్ యాక్ట్ భూములపైనా సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు