తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ప్రమాదం.. ప్రభుత్వ విప్ భవనం పైకప్పు కూలిపోయింది

మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (15:05 IST)
తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. పాత అసెంబ్లీ భవనం తూర్పు వైపు ఎలివేషన్ కూలింది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయ భవనం పైకప్పు గోపురం కూలిపోయింది. దీంతో భద్రతా సిబ్బంది పరుగులు తీశారు. అయితే శిధిలాలు గార్డెన్ ఏరియాలో పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
అసెంబ్లీకి వందేళ్ల చరిత్ర ఉంది. ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ పాలనలో నిర్మాణం ప్రారంభించారు. 1905లో పనులు ప్రారంభం కాగా.. 1913 డిసెంబర్‌ నాటికి భవన నిర్మాణం పూర్తయింది. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో భవనం అందుబాటులోకి వచ్చింది. మొదట్లో దీన్ని మహబూబియా టౌన్‌హాల్‌గా పిలిచేవారు. తర్వాత అసెంబ్లీగా మారింది. ప్రజల చందాలు వేసి ఈ భవనాన్ని నిర్మించడం విశేషం.
 
కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో కొత్త సెక్రటేరియట్, ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఆవరణలో కొత్త అసెంబ్లీ భవనాలను నిర్మిస్తున్నారు. 
 
గతేడాది ఈ నిర్మాణాలకు సంబంధించిన భూమి పూజ కూడా చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఇంతలోనే పాత అసెంబ్లీ పై కప్పు కూలడం చర్చకు దారితీసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు