వ్యక్తిగత సమస్యలు పక్కనబెట్టండి : నేతలకు రేవంత్ పిలుపు

ఆదివారం, 14 ఆగస్టు 2022 (16:52 IST)
సొంత పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ పిలునిచ్చారు. వ్యక్తిగత సమస్యలు పక్కనబెట్టాలని ఆయన కోరారు. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ, తెరాసలు ఓటర్లకు డబ్బులు ఇచ్చే ఓట్లు అడగాల్సిన పరిస్థితి ఉందన్నారు. అందువల్ల మునుగోడులో గెలిచి తీరాలన్న పట్టుదలతో ప్రతి ఒక్కరూ తమతమ వ్యక్తిగత సమస్యలు పక్కనబెట్టి కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు అపార నష్టం జరుగుతోందన్నారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆ ఎన్నికలపై దృష్టిపెట్టకుండా వ్యక్తిగత విమర్శలపై దృష్టి మళ్లుతోందన్నారు. ఇది ఆ నియోజకవర్గ ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. 
 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మునుగోడు నియోజకవర్గానికి నిధులిచ్చి ఓట్లు అడగాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను, పోడు భూముల సమస్యలతో పాటు స్థానిక ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని, ఇందుకోసం కేంద్రంలోనిబీజేపీ ప్రభుత్వం రూ.5 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు