నాగార్జున సాగర్ ఉప ఎన్నిక : తెరాస అభ్యర్థిగా నోముల భరత్

సోమవారం, 29 మార్చి 2021 (20:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరుగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిగా నోముల భగత్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. భగత్‌కు కేసీఆర్ బీ ఫామ్ ఇచ్చారు. సోమవారం ఉదయం భగత్ నామినేషన్ వేశారు. 
 
ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ దిగ్గజం, మాజీ మంత్రి జానారెడ్డిని ఢీకొట్టేందుకు సరైన అభ్యర్థి కోసం చివరిదాకా సర్వేలపై సర్వేలు చేసిన సీఎం కేసీఆర్‌.. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కే టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. 
 
దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌లో జరిగిన నష్టాన్ని పట్టభద్రుల ఎన్నికల్లో పూడ్చుకున్నామని.. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ సాధించి ఇక తిరుగులేదని నిరూపించుకోవాలని.. అధికార టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. దీంతో సాగర్‌ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రతి అంశాన్నీ కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే అభ్యర్థి ఎవరనేది మంత్రులకు, ఎమ్మెల్యేలకు సైతం తెలియకుండా చివరిదాకా సీఎం గోప్యత పాటించారు. కాగా.. పార్టీ తరఫున అభ్యర్థి ఖరారు కాకముందే.. ప్రచార బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యేలు స్థానికంగా తీవ్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఇకపోతే, బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు