సికింద్రాబాద్ లాడ్జి అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (11:20 IST)
సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందడం బాధిస్తుందన్నారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. 
 
కాగా, సికింద్రాబాద్‌లోని ఓ భవనం సెల్లార్‌లోని ఎలెక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో ఈ-బైకులు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. లాడ్జిలోని మొదటి, రెండో ఫ్లోర్లలో ఉన్న వారు ఊపిరి ఆడక చనిపోయినట్టు తెలుస్తోంది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పై నుంచి కిందకు దూకిన కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
 
ఈ ప్రమాద వార్త తెలిసిన ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో పలువురు చనిపోవడం బాధను కలిగిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. 
 
మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చనిపోయిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. గాయపడిన వారికి రూ.50 వేలు చెల్లిస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు