రేవంత్ రెడ్డి కాదు.. కోవర్ట్ రెడ్డి .. రోజా ఫైర్

శుక్రవారం, 9 జులై 2021 (12:13 IST)
వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా మరోసారి ప్రత్యర్థులుపై విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా మండిపడ్డారు. టీడీపీ రైతు దగా దినోత్సవం అంటూ నిరసనలు చేయడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు. 
 
రైతులను మోసం చేసిన ప్రభుత్వంగా టీడీపీ చరిత్రలోకి ఎక్కిందని విమర్శించారు. 14 ఏళ్లపాటు సీఎంగా చేసిన చంద్రబాబు రైతుల కోసం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తీసుకురాలేదన్నారు. విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతులని గుర్రాలతో తొక్కించి, లాఠీలతో తరిమికొట్టి, తూటాలతో భయపెట్టిన చరిత్ర చంద్రబాబుదని రోజా ఆరోపించారు.
 
అలాంటి చంద్రబాబు ఇప్పుడు సీఎం జగన్ పై విమర్శలు చేయడం తగదని.. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన వ్యక్తి వైఎస్ఆర్ అని.. తండ్రి బాటలోనే తనయుడు జగన్ నడుస్తున్నారని అన్నారు.
 
సీఎం జగన్ రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలు, అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేయడమే కాకుండా.., రైతుల ఇంటికే విత్తనాల నుంచి ఎరువుల వరకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టారని రోజా తెలిపారు.
 
అధికారంలోకి రాగానే 83వేల కోట్ల రూపాయలతో రైతులకు ఇచ్చిన హామీలను వివిధ పధకాలద్వారా అమలు చేశారన్నారు. చంద్రబాబు హయాంలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతే.. తమ హయాంలో నాణ్యమైన విత్తనాలు అందించే దిశగా అగ్రి ల్యాబ్స్ ప్రారంభించి నాణ్యమైన విత్తనాలు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 
 
చంద్రబాబు, లోకేష్ దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నాని.. చంద్రబాబు హయాంలో నీటి గొడవలే లేదని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అక్క ఉమా మహేశ్వరీ గారు తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు సమక్షంలో ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడం లోకేష్ మరచిపోయినట్లు ఉన్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి రాజధాని లో 10 ఏళ్ళు ఉండాల్సి ఉన్న ఓటుకు నోటు కేసుకు బయపడి చంద్రబాబు అమరావతికి వచ్చేశారని ఆరోపించారు. 
 
ఇక రోజా ఇంట్లో మంతనాలు జరిగాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆమె అన్నారు. రోజా ఇంటికి సీఎం జగన్ ఎప్పుడు వచ్చారో చెప్తే బాగుంటుందన్నారు. ఈయన రేవంత్ రెడ్డి కాదని.. కోవర్టు రెడ్డని ఎద్దేవా చేసిన రోజా.. టీడీపీ గురువులను కలవడంలోనే తెలుస్తోంది అతను టీడీపీ కోవర్ట్ అని తెలుస్తోందన్నారు. ఎవరొకరి మీద నిందలు వేయాలంటే చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని రోజా హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి