పుస్తకం పట్టి గంటసేపైనా చదవమన్న తండ్రి.. కత్తెరతో గొంతు కోసిన కుమారుడు

గురువారం, 22 ఏప్రియల్ 2021 (12:30 IST)
విద్యార్థులకు కరోనా పుణ్యమాని ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఆన్ లైన్ క్లాసులు జరిగినా చదువులకు చాలామంది విద్యార్థులు దూరంగా వున్నారు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా వుంటూ పుస్తకం తాకని కుమారుడిని తండ్రి మందలించాడు. పుస్తకం పట్టి గంటసేపైనా చదువు అని మందలించాడు. దీనిపై వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు యువకుడు పక్కనే ఉన్న కత్తెరతో తన తండ్రి మెడను పొడిచి చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం పాములపహాడ్​ గ్రామంలో బంటు ఎల్లయ్య(45), లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో కొడుకు నాగేందర్(19), కూతురు భవాని. నాగేందర్ ​సూర్యాపేటలో ఇంటర్​ ​సెకండ్​ ఇయర్ ​చదువుతున్నాడు. నాగేందర్ కి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఎల్లయ్య కొడుకును చదువుకోమని చెప్పాడు. ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ కాస్త పెద్దదిగా మారింది. నాగేందర్ ​ఆవేశంలో కత్తెరతో తండ్రి గొంతులో పొడిచాడు.
 
ఎల్లయ్య అక్కడే రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే స్థానికులు వచ్చి ఎల్లయ్యను హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు