తెలంగాణ సర్కారుకు ఊరట... సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీం ఓకే

గురువారం, 16 సెప్టెంబరు 2021 (12:59 IST)
తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించిది. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనానికి అడ్డంకులు తొలగిపోయాయి. గమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హుస్సేన్‌సాగర్ సహా అన్ని చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసుకోవడానికి అపెక్స్ కోర్టు సమ్మతం తెలిపింది. 
 
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం వాదనలను ఆలకించింది. 
 
జీహెచ్‌ఎంసీ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హైకోర్టు ఆర్డర్ వచ్చిందని సోలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయని, అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయని తెలిపారు. 
 
అయితే, హైకోర్టు ఆదేశాలను వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్‌లు ఏర్పాటు చేశామని కాలుష్యం జరగకుండా వెంట వెంటనే విగ్రహాలను తరలిస్తామని సోలిసిటర్ జనరల్ వివరించారు. నిమజ్జనంపై హైకోర్టు ఉత్తర్వులు చివరి నిమిషంలో వెలువడినందున ఈ సంవత్సరం అందులో కొన్ని మినహాయింపులు కోరుతున్నట్లు జీహెచ్ఎంసీ తరుపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. 
 
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. హుస్సేన్‌సాగర్‌‌లో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసుకోవచ్చని ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలు ఒక్క ఏడాదికి మాత్రమేనని, వచ్చే ఏడాది నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీల్లేదని పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్ కాలుష్యకారకంగా మారిపోయిందని, జల వనరులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు