ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణం : మోత్కుపల్లి

సోమవారం, 28 మే 2018 (13:17 IST)
స్వర్గీయ ఎన్టీ.రామారావు చావుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఎన్టీఆర్ 96వ జయంతిని పురస్కరించుకుని ఆయన సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు తనను దగా చేశారంటూ బోరున విలపించారు. చంద్రబాబు తనను గవర్నర్ చేస్తానని.. ఆ తర్వాత రాజ్యసభకు పంపిస్తానని చెప్పి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకు అండగా ఉంటే.. ఇప్పుడు తనను మహానాడుకు పిలవకుండా అవమానించారని విలపించారు. 
 
అంతేకాకుండా, తాను రాజకీయ కుట్రలకు బలి అయ్యానని చెప్పారు. ఆనాడు రాజకీయ కుట్రలకు ఎన్టీఆర్ కూడా బలయ్యారని తెలిపారు. తనకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లనే ఎన్టీఆర్ చనిపోయారని వ్యాఖ్యానించారు.
 
రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చిన మామని చంపావు అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నందమూరి వంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టారు. దగ్గుబాటి కుటుంబాన్ని, నందమూరి హరికృష్ణను చంద్రబాబు వాడుకొని వదిలేశారంటూ మండిపడ్డారు. 
 
కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబే కారణమన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టే కుట్రను చంద్రబాబు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, కేసీఆర్ మంచి తెలివిమంతుడు కావడం వల్లే చంద్రబాబును ఇరికించారని గుర్తు చేశారు. చంద్రబాబు పెద్ద నటచక్రవర్తి. మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారంటూ మోత్కుపల్లి ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు