పీకేకు ఒక్క శాతం ఓట్లు కూడా రావు.. బీజేపీ విజయం కల్ల : చంద్రబాబు జోస్యం

సోమవారం, 28 మే 2018 (12:29 IST)
వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఒక్క శాతం ఓట్లు కూడా రావనీ, అలాగే, భారతీయ జనతా పార్టీకి విజయం కల్ల అని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు.
 
విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో భాగంగా ఆయన మాట్లాడుతూ, తనను విమర్శించడానికి బీజేపీ పవన్ కల్యాణ్‌ను బాగా వాడుకుంటోందని, బీజేపీ మాటలను నమ్మి ఆయన తనపై నిత్యమూ అర్థరహిత విమర్శలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వచ్చే ఎన్నికల్లో జనసేన 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారనీ, కానీ, ఆయనకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓట్లు రావన్నారు. బీజేపీ ధోరణి వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని చెప్పారు. అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి అన్ని రకాల బిల్లులనూ కేంద్రానికి పంపినా, తమకేవీ అందలేదని బీజేపీ చీఫ్ అమిత్ షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
 
అనవసరంగా ఓ రాష్ట్రంతో పెట్టుకుంటే, ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలిసొచ్చిందని, తదుపరి ఎన్నికల్లో బీజేపీకీ ప్రజలు అదే విధంగా బుద్ధి చెబుతారన్నారు. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై తాను ధర్మపోరాటం చేస్తున్నానని, ఈ పోరాటంలో ప్రజలే అండగా, తాను విజయం సాధిస్తానన్న నమ్మకం తనకుందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు