హైదరాబాదులో భారీ వర్షాలు.. వాయిదా పడిన పరీక్షలు

మంగళవారం, 20 అక్టోబరు 2020 (17:38 IST)
హైదరాబాదులో భారీ వర్షాల కారణంగా తెలంగాణలో అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఆ రాష్ట్ర సర్కారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీలు ఈ నెల 19 నుంచి 20 వరకు జరిగే పరీక్షలను వాయిదా వేసుకున్నాయి. 
 
తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరదల కారణంగా అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే చాలామంది విద్యార్థులకు సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. 
 
మరోవైపు వాతావరణ శాఖ సైతం మరికొన్ని రోజులు భారీగా వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
 
అలాగే భారీ వర్షాల నేపథ్యంలో అంబేద్కర్ యూనివర్సిటీ పలు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21, 22, 23 తేదీల్లో జరగనున్న యూజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు