కరోనా టీకా వేసుకోకుంటే రేషన్ - పెన్షన్ కట్

మంగళవారం, 26 అక్టోబరు 2021 (11:42 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాలపై వైద్య, ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా టీకా వేయించుకోనివారికి రేషన్, పెన్షన్‌ను నిలిపి వేస్తామంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ నిబంధన నవంబరు 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలంగాణ ఆరోగ్య విభాగం డైరెక్టర్ డి.హెచ్. శ్రీనివాస రావు వెల్లడించారు. 
 
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకుని.. రెండో డోస్ వేసుకోనివారు సుమారు 35 లక్షల మంది ఉన్నారు. డోస్ తీసుకోవాల్సిన గడువు దాటిపోయినా కూడా వారు వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. ఈ విషయంపై అధికారులు పదేపదే వివరిస్తూ వచ్చినా కూడా జనాలు పట్టించుకోకపోవడంతో కఠిన చర్యలకు సిద్దమయ్యారు.
 
ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ వేసుకోకపోతే రేషన్, పెన్షన్ కట్ అవుతుందని శ్రీనివాసరావు స్పష్టంచేశారు. కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గలేదని.. దానిని నివారించేందుకు వ్యాక్సినేషన్ ముఖ్యమన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతమవుతుందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు