కాంగ్రెస్ ఓ భయంకరమైన పార్టీ : తెరాస ఎంపీ కవిత

బుధవారం, 31 జనవరి 2018 (14:56 IST)
కాంగ్రెస్ పార్టీ ఓ భయంకరమైన పార్టీ అని, అలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మాత్రం అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెరాస మంత్రివర్గంలో మహిళలు లేరనది పెద్దవిషయం కాదని.. మహిళల కోసం ప్రభుత్వం ఏం చేస్తున్నదనేది ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఆరుగురు మహిళా మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. టీజేఏసీ కన్వీనర్ కోదండరాం పార్టీ పెడితే స్వాగతిస్తామన్న కవిత… ఎన్నికల్లో పోటీచేసే హక్కు అందరికీ ఉందని, పవన్‌కల్యాణ్‌కూ ఉందన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చబోమని సీఎం కేసీఆర్ పదేపదే చెప్తున్నారని, మంచిగా పనిచేసుకోవాలని సూచిస్తున్నారని ఆమె తెలిపారు. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే సీఎం కేసీఆర్ స్వయంగా పిలిచి మాట్లాడుతున్నారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో హరీశ్‌రావు లోక్‌సభకు పోటీచేస్తారనేది ప్రచారం మాత్రమేనన్నారు. కేసీఆర్ రాజకీయ వారసులు ఎవరనేది భవిష్యత్‌లో తెలుస్తుందన్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై బీజేపీయేతర పక్షాలన్నీ అసంతృప్తిగా ఉన్నాయన్న కవిత… ఎన్నికల ప్రాతిపదికనే ఎన్డీయే అభివృద్ధి చేస్తోందని విమర్శించారు. పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరుగకపోవడం బాధాకరమన్నారు. కేంద్రం రాష్ట్రానికి చేయాల్సింది చాలా ఉందని, కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నామని ఓ ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు