అధికారం అనుభవించడానికి రాలేదు.. అధికారంలోకి తెచ్చేందుకే : సీతక్క

బుధవారం, 30 జూన్ 2021 (15:53 IST)
తాము అధికారం అనుభవించడానికి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదనీ, కేవలం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే వచ్చినట్టు టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మలుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. 

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా టీడీపీ మాజీ నేత, మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనయర్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీపీసీసీ కాస్త టీడీపీ పీసీసీగా మారిపోయిందని సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటివారు ఆరోపిస్తున్నారు. 

ఈ ఆరోపణలపై సీతక్క స్పందించారు. మెజారిటీ అభిప్రాయం మేరకే అధిష్టానం రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చారన్నారు. అధికారాన్ని అనుభవించడానికి తాము కాంగ్రెస్‌లోకి రాలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆమె కౌంటరిచ్చారు. 

ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తేవడానికే కాంగ్రెస్‌లోకి చేరినట్లు ఆమె స్పష్టం చేశారు. పార్టీ పలుచన అయ్యేలా ఎవరూ మాట్లాడవద్దని హితవుపలికారు. రేవంత్ టీమ్‌లోని కొందరికి పదవి రానందుకు తనకు కూడా అసంతృప్తి ఉందని సీతక్క అన్నారు.
 
రేవంత్‌కు పదవి వచ్చిందన్న సంతోషం కంటే బాధ్యత పెరిగిందన్నారు. పార్టీని సక్రమంగా నడిపించే బాధ్యత రేవంత్ అన్నపై ఉందని నేతలు, కార్యకర్తలు, అభిమానులు అన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడే నిజమైన సంతోషమని సీతక్క తెలిపారు. 

అధిష్టానం అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇవ్వడం జరిగిందన్నారు. ఒక్క రోజులో సీల్డ్ కవర్‌ రాలేదని.. చాలా రోజులు చర్చలు, అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే అధిష్టానం రేవంత్ అన్న పేరు ఖరారు చేసిందని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు