కొత్త సంవత్సర జోరు : రూ.వందల కోట్ల మందు తాగేశారు

మంగళవారం, 2 జనవరి 2018 (12:58 IST)
కొత్త సంవత్సర జోరు కొట్టొచ్చినట్టు కనిపించింది. 2017 సంవత్సరానికి స్వస్తి చెప్పేందుకు హైదరాబాద్ నగర వాసులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. సంవత్సరం చివరి రోజైన డిసెంబర్ 31వ తేదీన మద్యం మత్తులో ఎంజాయ్ చేశారు. ఫలితంగా రూ.వందల కోట్ల మద్యం తాగేశారు. 
 
సాధారణంగా పార్టీ అంటేనే మద్యం ఉండాల్సిందే. అదీ న్యూ ఇయర్ పార్టీ అంటే ఇక చెప్పక్కర్లేదు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 రాత్రి వరకు మద్యం ఏరులైపారుతుంది. ప్రతీ యేడాదిలానే ఈ యేడాది న్యూ ఇయర్ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం పొంగిపొర్లింది. మందుబాబులు ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఏకంగా రూ.200 కోట్లకుపైగా విలువైన లిక్కర్ తాగారు. 
 
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం డిసెంబర్‌ 31 ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా రూ.207.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంతేకాదు డిసెంబర్‌ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2017 డిసెంబర్ నెలలో అమ్మకాలు రూ.1,700 కోట్లకుపైగా ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వాటానే రూ.600 కోట్లుగా ఉన్నట్టు అంచనా వేశారు. 
 
ఇకపోతే, కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా, గ్రేటర్‌ హైదరాబాద్, శివారు ప్రాంతాల పరిధిలోనే ఏకంగా రూ.125 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్‌ పరిధిలోని 542 బార్లు, పబ్‌లు, 300 లిక్కర్ షాపులు, 134 ఈవెంట్లలో మద్యం మంచినీళ్లలా తాగారు. 
 
కొత్త యేడాది వేడుకల్లో గతేడాది రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా.. ఈసారి రూ.125 కోట్లకుపైగా నమోదయ్యాయి. నగరవ్యాప్తంగా 7 లక్షల కాటన్ల  బీర్లు, మరో ఐదు లక్షల కాటన్ల ఐఎంఎల్‌ మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు