సుప్రీంకోర్టు ఫెడరల్‌ స్వభావంతో పనిచేయాలి: జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌

సోమవారం, 1 మార్చి 2021 (10:59 IST)
సుప్రీంకోర్టు ఫెడరల్‌ స్వభావంతో పనిచేయాలని.. జాతీయస్థాయి, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి పరిమితం కావాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ అన్నారు. దృశ్యమాధ్యమం ద్వారా జరిగిన ప్రజాస్వామ్య పీఠం జాతీయ సదస్సులో భాగంగా ‘రాజ్యాంగ కోర్టులను బలోపేతం చేయడం’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.

పార్లమెంట్‌ చట్టాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని, రాష్ట్రాల పరిధిలోని అంశాలు, అసెంబ్లీ చట్టాలలో ప్రమేయం సరికాదని అభిప్రాయపడ్డారు. హైకోర్టుల్లో 40 శాతం ఖాళీలు ఉండటం సమస్యగా ఉందని తెలిపారు. పెండింగ్‌ కేసులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని, 1990లో సుప్రీంకోర్టు అలా చేసి అనవసర కేసులను తొలగించిందని గుర్తుచేశారు.

న్యాయవాది, న్యాయ నిపుణుడు సుధీష్‌పాయ్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ అధికరణలను నిర్వచించడం, రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం సుప్రీంకోర్టు ప్రధాన బాధ్యతలని పేర్కొన్నారు.

కర్ణాటకలోని ‘విధి’ సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ వ్యవస్థాపకుడు అలక్‌ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ.. హైకోర్టులు పెద్ద నగరాల్లో మాత్రమే కేంద్రీకృతమయ్యాయన్నారు. దూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల పేదలు న్యాయవ్యవస్థకు వెలుపల ఉండిపోతున్నారని చెప్పారు.

లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌నారాయణ ప్రసంగిస్తూ న్యాయవిద్య, న్యాయమూర్తుల్లో నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భారత జుడిషియల్‌ సర్వీస్‌ (ఐజేఎస్‌) వంటి విధానాలు పరిశీలించాలని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు